Hanuma Vihari: క్రికెటర్ హనుమ విహారికి ఏసీఏ షోకాజ్‌ నోటీసు

  • విహారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్న ఏసీఏ
  • ఫిర్యాదుల గురించి చెప్పేందుకు ఇదో అవకాశమని వ్యాఖ్య
  • నోటీసుకు బదులిచ్చానన్న విహారి
  • ఇతర జట్ల కోసం ఆడేందుకు ఎన్ఓసీ కోరినట్టు వెల్లడి
ACA Show cause notice to cricketer Hanuma Vihari

ఆంధ్ర క్రికెట్ సంఘంపై (ఏసీఏ) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఏసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తరువాత ఈ నెల 25న మెయిల్ ద్వారా ఈ నోటీసు పంపించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై హనుమ విహారి ఇంకా స్పందించలేదని ఏసీఏ వర్గాలు చెబుతున్నాయి. 

‘‘విహారికి షోకాజ్ నోటీసులు పంపించాం. అతడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం. గత నెలలో అతను ఎందుకు అలా స్పందించాడో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఫిర్యాదుల గురించి చెప్పేందుకు అతనికి ఇదో అవకాశం. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టు వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన విహారి విలువ మాకు తెలుసు’’ అని ఏసీఏ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. 

అయితే, ఈ నోటీసుకు తాను బదులిచ్చానని విహారి పేర్కొన్నాడు. తన విషయంలో అన్యాయంగా వ్యవహరించారని, రాబోయే దేశవాళీ సీజన్‌లో ఇతర రాష్ట్ర జట్టుకు ఆడేందుకు ఎన్ఓసీ అడిగానని అతడు వెల్లడించారు. ఏసీఏ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. 

గత నెల 26న మధ్యప్రదేశ్‌తో క్వార్టర్స్‌లో ఆంధ్ర జట్టు ఓటమి అనంతరం.. రాజకీయ నాయకుల జోక్యం కారణంగా తనను జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారని విహారి ఆరోపించిన విషయం తెలిసిందే. మరోసారి ఆంధ్రకు ఆడనంటూ ఇన్‌స్టాలో అతడు పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. జట్టులో 17వ ఆటగాడిపై అరవడంతో, రాజకీయ నాయకుడైన అతడి తండ్రి, ఏసీఏపై ఒత్తిడి తెచ్చి తనపై వేటు వేయించాడని విహారి ఆరోపించాడు. తనకు మద్దతుగా జట్టు, ఆటగాళ్లు సంతకాలు చేసిన లేఖనూ పోస్టు చేశాడు.

More Telugu News